మరికాల పంచాయతీలో అభివృద్ధి పనులకు స్థాపనలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : మారుమూల ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని, అందులో భాగంగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రత్యేక శ్రద్ధతో ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి సి ఆర్ ఆర్ నిధుల నుండి రూ. 2 కోట్లు మంజూరు చేశారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీరాములు రమేష్ అన్నారు. మండల పరిధిలోని మరికాలలో గురువారం సిఆర్ఆర్ నిధుల నుండి మంజూరైన అభివృద్ధి పనులకు లాంఛనంగా నాయకులు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టుందని, అందులో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం ప్రత్యేక శ్రద్ధ వహించి, కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నారని నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యే కు అభినందనలు తెలిపారు. మండలానికి ఇంకా అదనపు నిధులు మంజూరు చేసి, మండల అభివృద్ధికి సహకరించాలని, నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలసాని శ్రీనివాసరావు, పిల్లారిశెట్టి మురళి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.