జిల్లాలో డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో కంట్రోల్ రూం ఏర్పాటు
– రైతులు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి
– రేషన్ కార్డు కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు తెలంగాణ జ్యోతి : జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్ ధాన్యం అమ్మకాలలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తలెత్తే ఇబ్బందులపై ఫిర్యాదులు చేసేందుకు జిల్లా మేనేజర్, పౌర సరఫరాల శాఖ అధికారి కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. శనివారం తెలిపారు. కంట్రోల్ రూమ్ టోల్ఏర్పాటు తోపాటు ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 9347416178 కు ఫోన్ చేసి సమస్యలు తెలుప వచ్చని, ప్రతీ రోజు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు చేయవచ్చునని కలెక్టర్ తెలిపారు. నిర్ణీత వేళల్లో టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ధాన్యం అమ్మకా లలో ఏమైనా సమస్యలు ఉంటే తెలుపాలని, వచ్చిన ఫిర్యాదు లను స్వీకరించి తక్షణమే వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని అన్నారు. ధాన్యం అమ్మకాలలో ఇబ్బందులు ఉంటే సెల్ నెంబర్ . 9347416178 కు వాట్సాప్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా లోని రైతుల సౌకర్యంకోసం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ సేవలను వినియోగించుకోవాలన్నారు.
కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి
రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డు కోసం, రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకునేందుకు మీసేవ నందు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 7 నుండి ఈ ప్రక్రియ కొనసాగుతుందని, మీ సేవ నందు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అర్హులను గుర్తించి వారికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. జిల్లా ప్రజలు కొత్త రేషన్ కార్డు కోసం మీసేవ నందు దరఖాస్తు చేసుకోవచ్చనీ కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో రెండు రోజులు అకాల వర్షాలు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో రెండు రోజులు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ సూచన ప్రకారము రైతులు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం ములుగు జిల్లాలో ఆది, సోమవారాల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నదని రైతులు, ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అప్రమత్తంగా ఉండి తగుజాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.