సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన
– నియమ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
వెంకటాపురం,డిసెంబర్10,తెలంగాణజ్యోతి:గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయం, నియమ నిబంధనలు, ఇతర ఎన్నికల ప్రక్రియలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు బుధవారం వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి నట్లయితే అభ్యర్థులపై తప్పనిసరిగా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సమావేశంలో మాట్లాడుతూ అధికారులు 5 వేల లోపు ఓటర్లు కలిగిన పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా ₹1,50,000 వరకు, వార్డు సభ్యులు ₹30,000 వరకు మాత్రమే ఖర్చు చేయవచ్చని తెలిపారు. వ్యయ వివరాలను తప్పనిసరిగా ప్రొఫార్మా–1, ప్రొఫార్మా–4 లలో నింపి సమర్పించాలని సూచించారు. ఎన్నికలు ముగిసిన 45 రోజులలోపు ప్రతి అభ్యర్థి తన ఎన్నికల వ్యయ నివేదికను మండల పరిషత్ కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు జి.పి. ఎన్నికల పుస్తకాలు కూడా పంపిణీ చేశారు. మండలంలోని ఎన్నికల పరిస్థితిని అధికారులు వివరించారు. మొత్తం 18 గ్రామపంచాయతీలలో 60 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 166 వార్డుల్లో, 16 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగతా 150 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మరికాల గ్రామపంచాయతీ, వెంకటాపురం మేజర్ పంచాయతీలో 7 గురు సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇతర పంచాయతీల్లో బహుముఖ, త్రిముఖ పోటీలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. మండలంలో మొత్తం 25,336 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు చంద్రశేఖర్, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, జిల్లా ఆడిట్ ఆఫీసర్ మానస, మండల పంచాయతీ అధికారి జమ్మిలాల్తో పాటు 18 జి.పి.ల నుండి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు పాల్గొన్నారు.






