యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ పై అవగాహన
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 19 (తెలంగాణ జ్యోతి): రైతులు యూరియా ఎరువులను ఇకపై యాప్ ద్వారా సులభంగా పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురంలో ఏటూర్నాగారం ఏడిఎ ఆధ్వర్యంలో, వెంకటాపురం మండల ఎరువుల డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో యూరియా పొందేందుకు ప్రత్యేక యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. వెంకటాపురం మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్ మాట్లాడుతూ, డిసెంబర్ 20 (శనివారం) నుంచి రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా తీసుకొచ్చిన ప్రత్యేక యాప్లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. పట్టాదారు పాసుబుక్ ఉన్న రైతులు తమ పాసుబుక్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా యూరియాను బుక్ చేసుకోవచ్చని, కౌలు రైతులకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉందని చెప్పారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉండి, మొబైల్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. యూరియా కొనుగోలులో వచ్చిన ఈ మార్పులను రైతులు గమనించి, యాప్ ద్వారా సులభంగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని అన్ని రైతులకు చేరవేయాలని డీలర్లను వ్యవసాయ అధికారి కోరారు.






