మేడారం జాతర పేరుతో ప్రచార ఆర్భాటం తప్ప, భక్తుల ఇబ్బందులపై శ్రద్ధ లేదు
ఇసుక లారీలపై నిషేధం ఎందుకు లేదు? : డా. జాడి రామరాజు నేత
ఏటూరునాగారం, జనవరి 7 (తెలంగాణ జ్యోతి): మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను అడ్డుపెట్టుకొని కేవలం ప్రచార కార్యక్రమాల్లో దూసుకెల్లడం మంచిదే కానీ, జాతరకు వచ్చే లక్షలాది భక్తులు ఇసుక లారీల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వాటిపై నిషేధం విధించక పోవడం బాధాకరమని ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ సాధన సమితి వ్యవస్థాపకులు, బీజేపీ నాయకులు డా. జాడి రామరాజు నేత విమర్శించా రు. బుధవారం ఏటూరునాగారంలో మాట్లాడుతూ, నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లారీలు ఆగితే అవి ఇసుక లారీలేనని వ్యాఖ్యానించిన నేటి పంచాయతీ రాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఇసుక లారీల వల్ల కలుగు తున్న ఇబ్బందులపై ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ములుగు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న దనసరి అనసూయ సీతక్క ఇసుక లారీలను ఎందుకు బంద్ పెట్టించడం లేదని ప్రశ్నించారు.ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ, దళిత, బహుజన వర్గాలపై నిజమైన ప్రేమాభిమానాలు ఉంటే, మాటలకే పరిమితం కాకుండా ఇప్పటికైనా కొండాయి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి మేడారం జాతరకు వచ్చే భక్తులకు సక్రమమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అలాగే ములుగు బస్సు డిపో పనులు కొనసాగుతున్నప్పటికీ, ఏటూరు నాగారం బస్సు డిపో పనులు ఎందుకు ప్రారంభం కావడం లేదో కూడా మంత్రిని నిలదీయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు.మేడారం జాతర పేరుతో కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా, ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని, ఈ అంశాలపై ప్రజలే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని డా. జాడి రామరాజు నేత స్పష్టం చేశారు.






