నిర్దేశించిన గడువులోపు పనులన్నీ పూర్తి చేయాలి
– జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
తాడ్వాయి, డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి : మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ దేవాలయ ప్రాంగణ పునరుద్ధరణ అభివృద్ధి పనులన్నీ నిర్దేశించిన గడువులోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ దేవాలయ ప్రాంగణంలో కొనసాగుతున్న పునరుద్ధరణ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, రాతి స్తంభాల స్థాపన పనులు, ఆలయ ప్రాంగణంలోని రహదారులు, ఫ్లోరింగ్ సుందరీకరణ పనులు, జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులు, గుత్తేదారులతో మాట్లాడిన కలెక్టర్, డిసెంబర్ 24వ తేదీ లోపు దేవాలయ ప్రాంగణానికి సంబంధించిన అన్ని పనులు పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. రానున్న మహా జాతరకు కోట్లాదిమంది భక్తులు హాజరవుతారని పేర్కొన్న కలెక్టర్, దేవాలయ ప్రాంగణం మహా కళాఖండంలా రూపుదిద్దుకుని ప్రతి భక్తుడికి మధురానుభూతిని కలిగించే విధంగా అభివృద్ధి పనులు జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, తహసిల్దార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






