IHMCL : పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు షాక్..!
– ఐహెచ్ఎంసీఎల్ పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్లు కొనుగోలు చేయాలి.
– ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్ పనిచేయదని యూజర్లకు సూచన
డెస్క్: పేటీఎం సంస్థకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తరఫున టోల్ రుసుము వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ (IHMCL).. ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL)ను తొలగించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించటం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్లు కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. ఐహెచ్ఎంసీఎల్ పేర్కొన్న జాబితాలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, యెస్ బ్యాంక్ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. దాంట్లో పీపీబీఎల్ మాత్రం లేదు. ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లు, టాప్-అప్లు స్వీకరించొద్దని పీపీబీఎల్ను ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న సొమ్మును మాత్రం అది అయిపోయేంత వరకు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలోనే ఐహెచ్ఎంసీఎల్ తాజా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫాస్టాగ్ యూజర్లంతా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఐహెచ్ఎంసీఎల్ సూచించింది.