Elections | నవంబర్ 3 నుండి నవంబర్ 10 వరకు నామినేషన్ లు స్వీకరణ

Written by telangana jyothi

Published on:

Elections | నవంబర్ 3 నుండి నవంబర్ 10 వరకు నామినేషన్ లు స్వీకరణ

– ములుగు రిటర్నింగ్ అధికారి అంకిత్.

గవాక్షం, నవంబర్ 2, ములుగు ప్రతినిధి : నవంబర్ 3 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ మొదలై నవంబర్ 10 వరకు నామినేషన్ లు స్వీకరించనున్నట్లు, నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో అభ్యర్థులు జాగ్రత్తలు పాటించాలని ములుగు రిటర్నింగ్ అధికారి అంకిత్ అన్నారు. గురువారం ములుగు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణపై ములుగు రిటర్నింగ్ అధికారి అంకిత్ మీడియా సమావేశం నిర్వహించి చేసిన ఏర్పాట్లను వివరించారు. ములుగు రిటర్నింగ్ అధికారి అంకిత్ మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 9న విడుదల చేసిందని, జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టు దిట్టంగా అమలు చేస్తున్నామని, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నికల పరిశీలన కోసం నియోజకవర్గం పరిధిలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సు, వీడియో సర్వేలెన్స్ , వీడియో వీవింగ్ బృందాలు అకౌంటింగ్ బృందాలను ఏర్పాటు చేశామని, అక్టోబర్ 31 వరకు నూతన ఓటరు దరఖాస్తుకు అవకాశం కల్పించామని, పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న ఎన్నికల నోటఫికేషన్ విడుదల అవుతుందని, నామినేషన్ పత్రాలను నవంబర్ 3 నుంచి 10 వరకు పని దినాలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ములుగు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరిస్తామని అన్నారు. నవంబర్ 13న నామినేషన్ల స్క్రూటిని కార్యక్రమం ఉంటుందని , నవంబర్ 15 వరకు నామినేషన్ పత్రాలు ఉపసంహరణ గడువు ఉంటుందని, నవంబర్ 15న సాయంత్రం స్వతంత్ర అభ్యర్థులకు, గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించి పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని అన్నారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో నామినేషన్ ఫారం నిర్ణిత నమూనా 2బి లో ఉండాలని, గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు వారి అభ్యర్థిత్వాన్ని ఒకరు బలపరచాలని, గుర్తింపు పొందని పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు అయితే పది మంది అభ్యర్థిత్వాన్ని బలపరచాలని, ములుగు నియోజకవర్గం ఓటర్లు మాత్రమే అభ్యర్థులను బలపరచాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థి ములుగు నియోజకవర్గానికి చెందిన వారు కానప్పుడు, నామినేషన్ వేసే సమయంలో పేరు నమోదై ఉన్న నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి ఎలక్టోరల్ సర్టిఫైడ్ ప్రతిని సమర్పించాలని, స్పష్టంగా గుర్తించగలిగే రెండు ఫోటోలు (2×2.5సెం.మీ) అందించాలని, స్వతంత్ర అభ్యర్థులు, గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు ఫ్రీ గుర్తుల నుంచి 3 గుర్తులను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాలని రిటర్నింగ్ అధికారి తెలిపారు.గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు తప్పనిసరిగా ఫారం A , ఫారం B లను తప్పనిసరిగా సమర్పించాలని, నామినేషన్ తో పాటు విధిగా చెల్లించాల్సిన ధరావత్ 5 వేల చెల్లించాలని, అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, రిటర్నింగ్ అధికారి సమక్షంలో ప్రమాణం చేయాలని, నామినేషన్ పత్రాన్ని ప్రతిపాదకులచే సమర్పిస్తే స్క్రూటీని కంటే ముందు ప్రమాణం చేసినట్లు ధృవీకరణ పత్రం పొందాలని తెలిపారు. ఎన్నికల జమ ఖర్చుల నమోదు నిమిత్తం నామినేషన్ వేసే రోజు కన్నా ఒకరోజు ముందు విధిగా బ్యాంక్ ఖాతా ప్రారంభించాలని, అట్టి పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్ర సమర్పణ సమయంలో అందించాలని, అఫిడవిట్ లో ఖాళీలన్నింటినీ విధిగా పూరించాలని, 10 రూపాయల స్టాంపు పై నోటరీ చేయించాలని, ప్రతి పేజీపై నోటరీ ముద్ర సంతకం ఉండాలని, ప్రతి పేజీపై సంతకం చేయాలని, అసంపూర్తి ప్రమాణ పత్రం, నామినేషన్ తిరస్కరణకు కారణం కావచ్చని తెలిపారు. అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చని, 2 కంటే ఎక్కువ నియోజకవర్గాలలో నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడానికి వీలులేదని, నామినేషన్ వేయదల్చిన వారు, వారి అనుచరులు మూడు వాహనాలకు మించి వాడకూడదని, రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో ఆపి, నామినేషన్ సమర్పించడానికి రిటర్నింగ్ అధికారి చాంబర్లో ప్రవేశించాలని అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి చాంబర్లో అనుమతి ఉంటుందని తెలిపారు. నామినేషన్ ఫారంతో పాటు భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మిగతా పత్రాలు విధిగా సమర్పించాలని, పత్రాలు సమర్పించలేని స్థితిలో ఉంటే వాటిని సమర్పించడానికి రిటర్నింగ్ అధికారిచే నోటీసు పొందాలని, నోటీసులో పేర్కొన్న తేదీ సమయానికి వాటిని విధిగా సమర్పించాలని, నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల ఖర్చు అభ్యర్థి ఖాతాలో జమ కావడం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు తాహసిల్దార్ విజయ భాస్కర్, మీడియా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “Elections | నవంబర్ 3 నుండి నవంబర్ 10 వరకు నామినేషన్ లు స్వీకరణ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now