సక్రమంగా పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
– సీనియర్ డీ.ఈ.సి నీతిష్ వ్యాస్
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సక్రమంగా జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీనియర్ డీ.ఈ.సి నీతిష్ వ్యాస్ అన్నారు. బుధవారం ఢిల్లీ నుండి సీనియర్ డీ.ఈ.సి నీతిష్ వ్యాస్ , ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. సీనియర్ డీ.ఈ.సి నీతిష్ వ్యాస్ మాట్లాడుతూ నూతన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ నివేదిక వివరాలను సమర్పించాలని అన్నారు. జిల్లాలో ఉన్న చివరి ఓటరు వరకు తప్పనిసరిగా ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ చేయాలని. అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోటి చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగిం చుకునే ఓటర్ల జాబితా, అత్యవసర సేవల పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల జాబితా వివరాలను అందజేయాలని అన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు సేకరణ వివరాలను ప్రతి రోజూ మీడియా ద్వారా తెలియజేయాలని అన్నారు. పోలింగ్ రోజు విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ పూర్తి చేసి, ఈవిఎం కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, వారికి అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈవిఎం యంత్రాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు మద్యం పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల తనిఖీలలో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. సి విజల్ యాప్ వినియోగం పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100% , గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలో 60% వెబ్ క్యాస్టింగ్ చేయాలని, మిగిలిన పోలింగ్ కేంద్రాల బయట సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచారం సంబంధించి సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తు లకు ఎప్పటికప్పుడు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.ఈ వీడియో సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.