గోవిందరావుపేటలో బంజారాల ఆత్మీయ సమ్మేళనం : మంత్రి సత్యవతి
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని కమ్మ ఫంక్షన్ హాల్ లో బంజారా సమ్మేళనం నిర్వహించగా ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ఇకముందు మరింత అభివృద్ధి చేసుకుందమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 400లకే గ్యాస్, సౌభాగ్యలక్ష్మి కింద మూడు వేలు, తెల్లరేషన్ కార్డు దారులకు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో బంజారాలకు చేసిందేమీలేదని, మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ వస్తే కర్నాటక కరెంట్ కష్టాలు తెలంగాణలోనూ పునరావృతం అవుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని, కర్నాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నారని, తెలంగాణలో మూడు గంటల పార్టీ కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు అన్నారన్నారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో మూడు గంటల కరెంటే వస్తుందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ 24 గంటల పాటు రైతంగానికి ఉచిత విద్యుత్తును అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. రైతులపై ఉన్న ప్రేమ, చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి మాత్రం రైతుల పట్ల ఎటువంటి మమకారం, చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ ఎస్ పాలనలో తండాలను జీపీలుగా చేసిన నేత సీఎం కేసీఆర్ దన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో లంబాడా జాతికి ఏంచేశారో చెప్పాలి, గిరిజనులకు బిజెపి అన్యాయం చేసిందని, మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేదని, పదేళ్లపాటు గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా కాలయపన చేసి గిరిజనులకు ద్రోహం చేసిందని,బిజెపి కాంగ్రెస్ మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచిన పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వయంపాలన దిశగా అడుగులు పడ్డాయని, పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, సీఎం కేసీఆర్ పాలనలో ములుగు జిల్లాగా ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేసుకుంటున్నామని, ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతిని ప్రజలు ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, జిల్లా పోరిక గోవింద నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీ ఆర్ ఎస్ మండలాల ఇంచార్జ్ సమ్మరావు, దేవ్ సింగ్, జెడ్పిటిసి హరిబాబు, ఎంపీటీసీ రామ చంద్రు, ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సాయిబాబు, సర్పంచ్ వాణి, సుమలత, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.