మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దు
– కాటారం డి.ఎస్.పి సూర్యనారాయణ
కాటారం, జూన్ 19, తెలంగాణ జ్యోతి : గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలకు యువకులు బానిసలు కావద్దని కాటారం డిఎస్పి ఏ సూర్యనారాయణ అన్నారు. ఇటీవల నూతనంగా డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పి సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ నెలలో మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద గోదావరిలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన ఆరుగురి కుటుంబ సభ్యులకి సంతాపం తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద సూచన/హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాబోవు వర్షాకాలంలో గోదావరిలో నదీ ప్రవాహ తీవ్రత లోతు ఎక్కువ ఉంటుందని గోదావరిలోకి ఎవరు ఈతకు వెళ్లొద్దని, అలాగే జాలర్లు అప్రమత్తంగా ఉండాలని డి ఎస్ పి తెలిపారు. మండల పరిధి లోని జాతీయ,రాష్ట్ర రోడ్లమీద పశువులని (ఆవులు/గేదెలు) విడిచిపెట్టరాదని, అలా చేస్తే వాటిని గ్రామపంచాయతీ ద్వారా స్వాధీనం చేసుకొని గోశాలకు తరలిస్తామని తెలిపారు. ట్రాక్టర్లను, బైకులను ఇతర మోటార్ వాహనాలను మైనర్లకు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రుల మీద వాహన యజమానుల మీద కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని హెచ్చరించారు. మత్తు పదార్థాలైన గంజాయి, గుడుంబాలకు యువతరం దూరంగా ఉండాలని, ఒకవేళ గంజాయి సేవిస్తే వాళ్లపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ సి ఐ రామచంద్ర రావు,మహాదేవపూర్ ఎస్సై 2- నాందేవ్ పి ఎస్ ఐ సాయి శశాంక్ పాల్గొన్నారు.