జిల్లా కోర్టులో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహణ
– ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు అవగాహన సదస్సు
ములుగు ప్రతినిధి, మే 31, తెలంగాణ జ్యోతి : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాసంస్థ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోష్న హాజరై పొగాకు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై విస్తృతంగా చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగాకు తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుందని, దూమపానం చేయనివారు కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ కారణంగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారన్నారు. సిగరెట్లు, హుక్కా, ఈ-సిగరెట్లు, నమలే పొగాకుతో ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. అనంతరం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, కక్షిదారులతో పొగాకు రహిత జీవితం పట్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి. హెచ్. వేణుగోపాలచారి, ప్రధాన కార్యదర్శి రంగోజు బిక్షపతి, న్యాయవాదులు కొండి రవీందర్, రంగోజు సూర్యం, మన్సూర్ అలీ, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, కోర్టు సిబ్బంది, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.