ఎంపీడీఓకి ఎందుకు పట్టింపులేదు..?
నాణ్యత లోపాలపై అనుమానాలు..!
కన్నాయిగూడెం, ఫిబ్రవరి 6, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం పక్కనే నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ భవనంలో తీవ్ర స్థాయిలో నాణ్యత లోపాలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు, ముఖ్యంగా ఎంపీడీఓ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు స్థానికంగా పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. నిర్మాణ పనుల్లో నాసిరకం సామగ్రి వినియోగం, గోడల్లో స్పష్టంగా కనిపిస్తున్న పగుళ్లు, సరిగా చేయని ప్లాస్టరింగ్, సిమెంట్ మిశ్రమంలో ప్రమాణాలు పాటించకపోవడం వంటి లోపాలు ప్రారంభ దశలోనే బయటపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కార్యాలయం పక్కనే ఉన్న భవనమైనప్పటికీ ఇప్పటివరకు అధికారిక తనిఖీలు జరగకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్న ఈ పనులపై పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి నాసిరకం నిర్మాణాలతో భవనం ఎంతకాలం నిలుస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, రానున్న రోజుల్లో ప్రమాదాలకు కూడా అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






