కంకలవాగులో గుర్తుతెలియని అస్తిపంజరం లభ్యం
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 11, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం శివారు కంకలవాగులో గుర్తుతెలియని మానవ అస్తిపంజరం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గత వర్షాకాలంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న సమయంలో వంతెనపై నుంచి ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయినట్లు అప్పట్లో మత్స్యకారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వెంకటాపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై, అప్పట్లో పడవలతో గాలింపు చర్యలు చేపట్టినా ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఆ వ్యక్తి మండల కేంద్రానికి చెందిన ఇంధన శకట సోదకుడు బొగ్గుల శ్రీను అని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే తాజాగా లభ్యమైన అస్తిపంజరం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఘటన స్థలంలో లభ్యమైన దుస్తుల ఆధారంగా గుర్తింపు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మృతదేహంపై స్పష్టత కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేస్తామని పోలీసులు తెలిపారు. గత వర్షాకాలంలో వరదల్లో కొట్టుకువచ్చిన మృతదేహమా, లేక మిస్సయిన బొగ్గుల శ్రీనుదేనా అన్నది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.









