పోక్సో కేసులో ఇద్దరికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష
– బాధితురాళ్లకు చెరో రూ.10లక్షల పరిహారం
ములుగు ప్రతినిధి, జూన్30, తెలంగాణ జ్యోతి : రెండు వేరువేరు పోక్సో కేసుల్లో ఇద్దరు నిందితులకు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాళ్లకు ఒక్కొక్కరికి చెరో రూ.10లక్షల పరిహారం అందించేలా ములుగు జిల్లా జడ్జి ఎస్.వీ.పీ సూర్యచంద్ర కళ సంచలన తీర్పు వెలువరించారు. అందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ మీడియాకు సోమవారం వెల్లడించారు. ములుగు జిల్లా కోర్టులో 2వేరు వేరు పోక్సో కేసులు విచారణకు రాగా వాదోపవాదనలు విన్న జడ్జి నేర నిరూపణ జరిగినందున జైలు శిక్షతోపాటు ఇద్దరికీ రూ.17వేల జరిమానా విధిస్తూ తీర్పుని చ్చారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలానికి చెందిన మేడిపల్లి భాస్కర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన మాచర్ల శ్రీహరిలపై పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 2018 నుంచి విచారణ జరగగా సోమవారం పోలీసుల సాక్షాధారాల ప్రకారం నిందితులపై నేర నిరూపణ జరగడంతో జడ్జి కఠిన శిక్ష విధించారు. కేసుల విచారణలో చురుకుగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ అభినందించారు.