అక్రమ అరెస్టులపై తుడుందెబ్బ ఆగ్రహం
మైపతి అరుణ్ కుమార్ విడుదల చేయాలని డిమాండ్
వెంకటాపురంనూగూరు, మార్చి22, తెలంగాణ జ్యోతి: అక్రమ అరెస్టుల పై తుడుందెబ్బ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైపతి అరుణ్ కుమార్ విడుదలకు డిమాండ్ చేసిన సంఘటన ములుగు జిల్లా వెంకటాపురంలో చోటు చేసుకుంది. ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ను తాడ్వాయి పోలీసులు మార్గమధ్యలో అరెస్టు చేయడాన్ని మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. మహబూబాబాద్ జిల్లా సమావేశానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగడం దారుణమని మండల అధ్యక్షుడు తుర్స చంటి దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసి హక్కుల కోసం పోరాడుతున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఆదివారం వెంకటాపురం మండల కేంద్రంలో జరిగిన అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ వెంటనే అరుణ్ కుమార్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు పోరాటం కొనసాగుతుందని, అక్రమ అరెస్టులకు భయపడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వాసం మధు, సోడి శ్రీను, కంతి ధని కుమార్, కొరస యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.









