వచ్చే సోమవారంలోగా దుకాణాలు ఖాళీ చేయాలి
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం పట్టణంలో రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను వచ్చే సోమవారం ఉదయం లోపు ఖాళీ చేయాలని గ్రామపంచాయతీ అధికారులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. ప్రధాన రహదారికి ఇరువైపులా వ్యాపారాలు కొనసాగుతుండటం తో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు ఆటంకం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం పోలీసుల సహకారంతో దుకాణాల వద్ద విక్రయాలను నిలిపివేయగా, చిరు వ్యాపారులు వారం రోజుల గడువు ఇవ్వాలని పోలీస్ స్టేషన్లో విన్నవించారు. జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని వేడుకోగా, అధికారులు వచ్చే సోమవారం వరకు గడువు మంజూరు చేసి ఖాళీ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆక్రమణల తొలగింపు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు.









