డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి
– యువత భవిష్యత్తును రక్షించాలి : మంత్రి సీతక్క
ములుగు ప్రతినిధి, జూన్ 26, తెలంగాణ జ్యోతి : మత్తు పదార్థాలతో యువత జీవితం చిత్తవుతుంది వారి భవిష్యత్తును రక్షించేందుకు తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు తంగేడు స్టేడియంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని, కుటుంబాలు, సమాజం సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, బహిరంగ ప్రదేశాల్లో మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా పెంచినట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత ములుగు జిల్లా లక్ష్యంగా అధికారులు సమర్థ వంతంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ విషయంలో శక్తివంచన లేకుండా వ్యవహరిస్తోందని, డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ పి. శబరీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఇతర అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అవగాహన ర్యాలీగా తంగేడు స్టేడియం నుండి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు యువత, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై సమాజం మొత్తం చైతన్య వంతంగా స్పందించాల్సిన అవసరం ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.