ఆదివాసి ఎరుకల కులస్తులను గుర్తించాలి
ఏటూరునాగారం మండల కమిటీ ఎన్నికలు
మండల అధ్యక్షుడిగా జగన్నాథం రాంబాబు
ఏటూరునాగారం, ఏప్రిల్ 12, తెలంగాణ జ్యోతి: ఆదివాసి ఎరుకల కులస్తులను అధికారికంగా గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఏటూరునాగారం గిరిజన భవన్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరుకల కులస్తులు తట్టలు, బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగిస్తున్నా ఇప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీఐ వంటి విద్యా, ఉపాధి అవకాశాలు వారికి అందడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. మే 1న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామంజపురంలో నాంచారమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఈ జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా హాజరవుతారని, వారికి అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు సంఘం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాకతీయుల కాలంలో నిర్మించబడిన పంచకూటాలయంగా ప్రసిద్ధి చెందిన నాంచారమ్మ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం మండల కమిటీ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా జగన్నాథం రాంబాబు, గౌరవాధ్యక్షుడిగా జగన్నాథం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా జగన్నాథం సాగర్, ఉపాధ్యక్షులుగా సాల్ల సాంబయ్య, కోశాధికారిగా కేతుల సారయ్య, సహాయ కార్యదర్శిగా రేవల్లి కిరణ్, మహిళా మండల అధ్యక్షురాలిగా శ్రీరాముల సారమ్మ, ప్రధాన కార్యదర్శిగా కేతిరి రజిత, ఉపాధ్యక్షురాలిగా కేతిరి స్వరూప, కోశాధికారిగా సుల్తాన్ సారమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేతిరి బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లకొండ ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.









