నకిలీ విత్తనాలు, ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలి
– దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం
– ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
– రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హనుమకొండ, తెలంగాణ జ్యోతి : నకిలీ విత్తనాలు, ఎరువులు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఎస్పీలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలసి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఉమ్మడి వరంగల్ జిల్లా లో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి సంబంధించిన అంశాలపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులను ఉక్కుపాదంతో అరికట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా విక్రయించకుండా నకిలీ ఎరువులు, విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మినట్లయితే పీడీ యాక్ట్ ను నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. రాష్ట్రంలో అంచనాలకు మించి 160 శాతం ధాన్యం అధికంగా వచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణలో (ఖరీఫ్, రబీ రెండు సీజన్లో) తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం లో ఉందన్నారు. ధాన్యం అంశానికి సంబంధించిన తలైత్తుతున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తా మన్నారు. ముందస్తుగానే వర్షాలు పడుతుండడంతో ధాన్యం తడిసిందన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 85% ధాన్యము కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజా ప్రతినిధులు, అధికారులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలన్నారు. నిర్ణీత గడువుని నిర్ణయించి దాని ప్రకారం ఇల్లు నిర్మాణం పూర్తి కావాలన్నారు. జూన్ 6వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఎలాంటి ఇబ్బం దులు లేకుండా అందజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను సంబంధిత ఎమ్మెల్యేలకు కలెక్టర్లు అందజేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులకు ఏజ్ లిమిట్ లేదని పేర్కొన్నారు. అత్యంత నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ సంవత్సరంలో ఇల్లు నిర్మించుకోలేని లబ్ధిదారులు ఎవరైన ఉన్నట్లయితే వచ్చే ఏడాది వారు కట్టుకునే విధంగా కలెక్టర్లు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి సోమవారం సాయంత్రం నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాకు సంబంధించి తాను సంతకం చేసిన ఫైళ్లను వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లు మంజూరు పత్రాలను సంబంధిత ఎమ్మెల్యే లను అందజేయాలన్నారు. పేదోడి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళుతుందన్నారు. గత పదేళ్లుగా ఇండ్లు లేక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు కలెక్టర్లు చర్యలు చేపట్టాలని పేర్కొన్నా రు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను ప్రభుత్వం అందిస్తుందని, రవాణా ఖర్చులు మాత్రం లబ్ధిదా రులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాల కలెక్టర్లు ఇందిరమ్మ ఇండ్లు పథకానికి లబ్ధిదారుల పేర్లతో కూడిన బఫర్ జాబితాను రూపొందించాలన్నారు. ఇచ్చిన ఆదేశాలను నిర్లక్ష్యం చేయొద్దని అధికారులకు ఆదేశించారు. మొదటి దశలో అత్యంత నిరుపే దలకు ఇందిరమ్మ ఇండ్లు అందాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం నిరంతర ప్రక్రియని పేర్కొన్నారు. సాదా బైనామా విషయం కోర్టు లో ఉందని, కోర్టు సెలవులు పూర్తికాగానే ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రామ పాలన ఆఫీసర్స్ టెస్ట్ పూర్తయిందని, పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి జూన్ 2వ తేదీన గ్రామ పాలన అధికారులను నియమించబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడుకోవాలన్నారు. రైతులు, భూములు ఉన్న వారిని ఇబ్బందులు పెట్టొద్దన్నారు. రైతులను ఇబ్బందులను పెడితే చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. జూన్ మూడవ తేదీ నుండి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించాలని, స్వీకరించిన దరఖాస్తులను ఆగస్టు 15వ తేదీ నాటికి పరిష్కరించాల న్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉదయం జిల్లా కేంద్రంలో కార్యక్రమం నిర్వహించాలని, అదే రోజు మధ్యాహ్నం నియోజకవర్గ కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేయాలన్నారు.
– రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు ఎరువులు నియంత్రణకు ఏర్పాటుచేసిన కమిటీలో అధికారులతో పాటు రైతులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్ కు విత్తనాలు ఎరువులు తరలకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ క్రియాశీలకంగా పనిచేస్తూ నిరంతరం నిఘా ఉంచాలన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల ద్వారా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువలపై అవగాహన కల్పించాలన్నారు. అటవీ, రెవెన్యూ, ఎండోమెంట్ శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
– రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
– హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో 157 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఒక లక్ష 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. దాదాపుగా 40% ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇతర జిల్లాల నుండి కూడా జిల్లాకు ధాన్యం వచ్చిందన్నారు. ఇంకా దాదాపు పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉందన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ఎక్కువ శాతం వరి, పత్తి సాగు చేయనున్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు ఇబ్బందులు లేకుండా సరిపోను ఉన్నాయన్నారు. విత్తన, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను సందర్శించి వాటి నిల్వలను పరిశీలించినట్లు తెలిపారు. 9070 ఇందిరమ్మ ఇండ్లు హనుమకొండ జిల్లాకు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. 4310 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్బన్ ప్రాంతంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో 933 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. అదేవిధంగా భూభారతి కింద జిల్లాలో నడికూడ మండలం ఎంపికైందని, ఆ మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించి దరఖాస్తులను స్వీకరించి విచారణ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు.
– వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ రబీ సీజన్ లో జిల్లాలో 2 లక్షల మేట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, 187 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు ఒక లక్ష 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ఎక్కువ శాతం వరి, పత్తి సాగు చేయనున్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు ఇబ్బందులు లేకుండా సరిపోను ఉన్నాయన్నారు. విత్తన, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను సందర్శించి వాటి నిల్వలను పరిశీలించినట్లు తెలిపారు. 11 వేల ఇందిరమ్మ ఇండ్లు వరంగల్ జిల్లాకు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. 6853 ఇండ్లు మంజూరు చేసినట్లు, వాటికి ప్రొసీడింగ్స్ అందిసృన్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో 612 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. అదేవిధంగా భూభారతి కింద జిల్లాలో ఎంపికైన వర్ధన్నపేట మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించి దరఖాస్తులను స్వీకరించి విచారణ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు.
ములుగు, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతికి సంబంధించిన వివరాలను సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరించారు.
– ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ నకిలి విత్తనాలు ఎరువుల నియంత్రణపై డీఎస్పీ స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఉండాలన్నారు.
-పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి మాట్లాడు తూ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయా లన్నారు.
-వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో 95% ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిం దని అన్నారు. ఇతర జిల్లాల నుండి తన నియోజకవర్గంలోని మిల్లులకు ధాన్యం వస్తుందని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించి చర్యలు చేపట్టాలన్నారు.
– భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ట్రక్ షీట్ లు కొనుగోలు కేంద్రంలో ఇవ్వడం లేదన్నారు. ట్రక్ షీట్లు ఇప్పటికైనా అందించాలన్నారు. తొమ్మిది రైస్ మిల్లులలో అవకతవకలు జరుగుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అవకతవకలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై చర్యలు చేపట్టాలన్నారు.
– నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ట్రక్ షీట్ సమస్య తన నియోజకవర్గంలోను ఉందని, రసీదులు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టా లని మంత్రిని కోరారు.
– స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుల పేర్ల జాబితాను కలెక్టర్ కు అందజేసినట్లు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు లేవని, వారికి అర్హతలను పరిశీలించి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేయాలని మంత్రి దృష్టికి తీసుకు వెళ్లగా కలెక్టర్ పరిశీలించి పొజిషన్ సర్టిఫికెట్లను అందజేయాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కు సూచించారు.
– పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక రవాణా అందించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సాదా బైనామా అంశం పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఎంతోమంది సాదా బైనామా ద్వారా న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస జనగామ, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు రిజ్వాన్ భాషా షేక్, టీఎస్ దివాకర, అద్వైత్ కుమార్ సింగ్, రాహుల్ శర్మ, ఎస్పీలు, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.