అంగరంగ వైభవంగా శ్రీ బీరమయ్య జాతర
వేలాదిమంది భక్తుల సందడి
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం పంచాయతీ పరిధిలో, తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులో గోదావరి నది తీరాన కొండలపై వెలసిన భీష్మ శంకరుడు శ్రీ బీరమయ్య జాతర అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించబడింది. ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరకు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. శనివారం ప్రారంభమైన జాతర సోమవారంతో ముగియనుండగా, ముఖ్యం గా రాత్రి సమయంలో ఆదివాసీలు తమ సంప్రదాయాలకు అనుగుణంగా డోలి, సన్నాయి వాయిద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర కమిటీ భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్హెచ్-163 జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాలంటీర్లు, యువకులు ట్రాఫిక్ను నియంత్రించారు. భక్తులకు మంచినీటి సదుపాయం, కొండపైకి వెళ్లేందుకు షేడ్ నెట్ ఏర్పాట్లు, ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.









