ఆశ్రమ పాఠశాలల్లో ఆర్బీఎస్కే వైద్య శిబిరం
విద్యార్థులకు సమగ్ర వైద్య పరీక్షలు
పోషకాహారంపై అవగాహన
ములుగు,మార్చి28,తెలంగాణజ్యోతి:ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఐలాపూర్, మల్యాల మరియు చిన్న బోయినపల్లి ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులను పరీక్షించి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. శారీరక–మానసిక అభివృద్ధికి పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఐలాపూర్లోని కంటైనర్ అదనపు ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామస్తులకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో చెవి, ముక్కు, గొంతు నిపుణుడు డాక్టర్ సారంగపాణి, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రవితేజ, నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ కిషన్, డాక్టర్ అమృత్, గైనకాలజిస్ట్ డాక్టర్ నికిత, దంత వైద్యులు డాక్టర్ శ్రీ సాయి, ఆర్బీఎస్కే నోడల్ ఆఫీసర్ డాక్టర్ నరహరి, ఫార్మసిస్ట్ భాస్కర్, ఏఎన్ఎం రజిని తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొన్నారు.










