సాకలి వాగుపై వంతెన నిర్మాణం కోరుతూ వినతి
వాజేడు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వాజేడు మండలంలోని కోయ వీరాపురం గ్రామ ప్రజలు తమ దీర్ఘకాలిక సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సాకలి వాగుపై వంతెన లేకపోవడంతో ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని, విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేకపోవడం, రైతులు వ్యవసాయ పనులకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరుకోవడం కూడా కష్టసాధ్యమవుతోందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి తుడుం దెబ్బ మండల కమిటీ సభ్యులు ప్రజా దర్బార్లో పాల్గొని ఐటిడిఏ ఏపీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తొర్రెం సంతోష్, ప్రధాన కార్యదర్శి చాప లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు వాసం సంతోష్ తదితరులు సమస్య తీవ్రతను వివరించారు. వంతెన నిర్మాణం జరిగితే గ్రామ అభివృద్ధికి దోహదపడటమే కాకుండా ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. దీనిపై స్పందించిన ఏపీఓ సమస్య ప్రాముఖ్యతను గుర్తించి సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.









