తెలంగాణ ఉద్యమకారుల శాంతియుత దీక్ష
మహాదేవపూర్, జూన్ 30, తెలంగాణ జ్యోతి : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శాంతియుత దీక్షలలో భాగంగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శాంతియుత దీక్షలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, తెలంగాణ సాధనకు కృషిచేసిన ఉద్యమకారులకు గుర్తింపునివ్వాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు సట్ల సత్యం కోరారు. పార్టీలకతీతంగా తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పోరు సల్పిన తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. గృహవసతిని కల్పించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఫోరం కోరింది. ఈ కార్యక్రమంలో సట్ల సత్యం, ఆంకారి ప్రభాకర్, దేవేందర్, అయుబుద్దిన్ ఖాన్ బెల్లంకొండ సురేష్, గోపాల్ రావు, అశోక్, ఎజాజ్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. కాలేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ గుడాల శ్రీనివాస్ దీక్ష శిబిరాన్ని సందర్శించి తెలంగాణ ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించారు. గత బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని గుడాల శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత ప్రయోజనాలు కల్పించడానికి తాము కృషి చేస్తామని గుడాల శ్రీనివాస్ అన్నారు.