MULUGU | ప్రభుత్వ భూమికి పంగనామాలు.. ?

MULUGU | ప్రభుత్వ భూమికి పంగనామాలు.. ?

MULUGU | ప్రభుత్వ భూమికి పంగనామాలు.. ?

– 2007లో తీసిన నక్షకు మంగళం

– ఆక్రమణదారుల కబ్జాలో ప్రభుత్వ భూమి!

– 181 ప్లాట్లలో పంచింది కొందరికే

– మిగిలిన 90 ప్లాట్లు ఏమైనట్లు?

– ములుగు రెవెన్యూలో అక్రమాలు జరిగినట్లు ప్రచారం

– మున్సిపాలిటీలో అయినా ఆక్రమణలు ఆగేనా

ములుగు ప్రతినిధి, జూన్ 28, తెలంగాణ జ్యోతి : కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ ఆక్రమణలకు అతీతమైన భూమి అన్నట్లు ములుగు జిల్లా కేంద్రంలో కబ్జాదారుల ఆగడాలు సాగుతున్నాయి. భూ బకాసురులు పేద, మధ్యతరగతి ప్రజలకు చెందాల్సిన భూములను కబ్జా చేస్తుండడం ఒక ఎత్తైతే ఏకంగా ప్రభుత్వ భూమికి పంగనామాలు పెట్టి లేనికాగితాలు సృష్టించి ప్రభుత్వ భూమి మాదంటూ కోర్టుకెక్కుతున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి నివాస స్థలం కోసం పట్టాలు పొందిన నిజమైన లబ్ధిదారులకు తీరని అన్యాయం జరుగుతోంది. అదేవిధంగా మరికొందరు తమ పట్టా భూమిని ప్రభుత్వ ఉద్యోగులు ఆక్రమిం చుకున్నారంటూ కోర్టుకెక్కారు. ప్రభుత్వ అధికారుల అలసత్వానికి తోడు కబ్జారాయుళ్ల దూకుడుతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో గత పాలకుల హయాంలో రియల్ భూం ఉండడం భూముల రేట్లు పెరిగి పోవడంతో కబ్జాదారుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. 1254/2, 1255/2 సర్వే నెంబర్లలో 2007 సంవత్సరంలో ప్రభుత్వం నిరుపేద ప్రజలకు నివేశణ స్థలాల కోసం గీసిన నక్షా రూపురేఖలే మారిపోయినట్లు తెలుస్తోంది..

– 90ప్లాట్లు ఎటుపోయాయి..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ములుగు మండల కేంద్రంలో అప్పటి తహసీల్దార్ పట్టాదారుల నుంచి 1254/2, 1255/2 సర్వే నెంబర్లలో సుమారు 4ఎకరాల భూమిని కొనుగోలు చేసి వారికి మార్కెట్ ధర మేరకు డబ్బులు చెల్లించి నిరుపేదలకు భూపంపిణీ కోసం ప్లాట్లు చేశారు. 2007వ సంవత్సరంలో ములుగు శివారులోని బండారుపల్లి రోడ్డులో రెండు సర్వే నెంబర్లను కలుపుకొని 181ప్లాట్లు చేసిన తహసీల్దార్ ప్రతీ ప్లాటు 90గజాలు నిర్ణయించారు. అందులో బండారుపల్లిరోడ్డును ఆనుకొని ఉన్న ప్లాట్లలో బీడీ కార్మికులు, పలువురు జర్నలి స్టులకు బీపీఎల్ కింద స్థలాలు అప్పగించారు. అయితే అందులో 90ప్లాట్లకు సంబంధించి ప్రస్తుతం ఆక్రమణ జరిగినట్లు నిజమైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. సుమారు ఎకరం 26గుంటల భూమి కబ్జాకు గురైనా పాలకులు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడం విస్మాయానికి గురిచేస్తోంది.

– నక్ష రూపురేఖలు మాయం.. 

2007 జూన్ 2న అప్పటి తహసీల్దార్ 181ప్లాట్లకు నక్ష రూపొందించి సర్వేయర్ తో హద్దులు కూడా నిర్ణయించి లబ్ధిదారుల కోసం మ్యాప్ తయారు చేయించారు. అందులో నిరుపేదలకు ఇంటి జాగా కోసం ప్లాట్లు కేటాయిస్తూ హక్కు పత్రాలను సైతం జారీ చేశారు. అయితే కొంతమంది లబ్ధిదా రులు అందులో ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటుండగా మరి కొందరు డబ్బులు లేక ఖాళీగా వదిలివేశారు. అయితే ఈ స్థలాన్ని కొందరు కబ్జారాయుళ్లు ఆక్రమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ప్రభుత్వం కొనుగోలు చేసి నిరుపేదలకు పంపిణీ చేసిన భూమిని సైతం కబ్జా చేయడంపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల వైఫల్యం కనిపి స్తోందని ఆరోపిస్తున్నారు. అప్పుడు తీసిన నక్ష రూపురేఖలనే మార్చివేసి కబ్జా చేసిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

– కబ్జాలో ప్రభుత్వ ఉద్యోగులు..?

ప్రభుత్వం కేటాయించిన నివేషణ స్థలాల్లో మిగిలిన ప్లాట్లపై కొందరి కన్ను పడింది. అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. 2007లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధన ప్రకారం ఒక్కో ప్లాటు 90గజాలు మాత్రమే ఉండాలి. అయితే కొంతమంది కలెక్టరేట్, మండల రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని భవంతులు నిర్మిస్తున్నట్లు సమాచారం. వారు అధికారుల నుంచి హక్కు పత్రాలు తీసుకున్నారని, అందులో భాగంగానే ఇంటి నెంబర్లు ఇచ్చినట్లు జీపీ అధికారులు చెబుతుండగా 90గజాలు మాత్రమే ఉండాల్సిన సదరు హక్కు పత్రాల్లో ఏకంగా ఒక్కొక్కరికి 120గజాలు, 200గజాలు కేటాయించినట్లు పత్రాలు చూపిస్తున్నారు. అయితే నోట్ ఫైల్ ఒక సంవత్సరంలో ఉండగా హక్కుపత్రం జారీ చేసిన తేదీలకు పొంతన లేకపోవడం పలు అనుమాలకు తావిస్తోంది. తహసీల్దార్ స్వయంగా హక్కు పత్రాలు ఇచ్చారని చెబుతున్నా పత్రాలను ఉన్నతాధికారులు పరిశీలించి విచారణ చేస్తే అందులో విస్మయానికి గురిచేసే నిజాలు తెలిసే అవకాశం ఉందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ హక్కు పత్రాలు అసలువా, నకిలీవా అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

– మున్సిపాలిటీలో అయిన ఆక్రమణలు ఆగేనా

ములుగు జిల్లా కేంద్రం మరో రెండు గ్రామ పంచాయతీలు బండారుపల్లి జీవంతరావుపల్లి లను కలుపుతూ మున్సిపాలిటీగా ఏర్పాటైన నేపథ్యంలో కబ్జా దారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేస్తారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాలి జాగాలకు ఇంటి నెంబర్లు కేటాయించడాన్ని రద్దు చేస్తారా లేదా అని ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ పరిధిలో జరుగుతున్న అక్రమాలను విచారణ చేపట్టి నిజమైన ప్లాట్ల లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్లాట్లు కేటాయించబడిన లబ్ధిదారులు ఉండకుండా ఇతరులు ఆ స్థలాలలో ఇల్లు నిర్మించుకొని ఉండడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.గతంలో జరిగిన తప్పిదాలను పరిశీలించి ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వంలో దోషులను గుర్తించి చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విషయాలను తహసీల్దార్, కలెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. బినామీ పేర్లతో జాగాలను ఆక్రమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తతంగంపై లోతైన విచారణ జరపాలని స్థానికలు, ప్రజా, కుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment