ట్రాన్స్ఫార్మర్ను దొంగిలించిన దుండగులు.. రైతుల్లో ఆందోళన…
ఏటూరునాగారం, ఫిబ్రవరి 6, తెలంగాణ జ్యోతి : మండల పరిధిలోని చిన్నబోయినపల్లి శివారులో దొంగల హల్చల్ తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి అనే రైతుకు చెందిన పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి, అందులోని విలువైన కాపరి వైర్ను దొంగిలించారు. నాట్లు వేసిన రైతులు సాగునీటికి ఎదురుచూస్తున్న కీలక సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం కావడంతో పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో గ్రామ శివార్లలో ఇలాంటి దొంగతనాలు పెరుగుతున్నాయని, రాత్రి వేళల్లో గస్తీ లేకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ను త్వరితగతిన పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.






