ములుగులో ఘనంగా మహాలక్ష్మి సంబురాలు
– ఉచిత బస్సు ప్రయాణంలో పాల్గొన్న మంత్రి సీతక్క
ములుగు ప్రతినిధి,జులై 23, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా లో మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికురాలిగా ప్రయాణించి, ములుగు బస్టాండ్ కు చేరుకొని మహిళా ప్రయాణికుల అనుభవాలను తెలుసుకున్నారు. బస్టాండ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం లో మహిళలకు స్వీట్లు తినిపించి సంబురాలు జరిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు రూ.6700 కోట్ల ఆదా జరిగిందని తెలిపారు. ఈ మొత్తం ప్రభుత్వమే RTCకి చెల్లించిందన్నారు. ఉచిత ప్రయాణాన్ని విజయవంతం చేసిన ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు. ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు మహిళల తరుపున ధన్యవాదాలు తెలిపారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని, అందుకే ఉచిత ప్రయాణంతో పాటు వడ్డీ లేని రుణాలు, రూ.500కే వంట గ్యాస్, 200 యునిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ములుగులో నూతన బస్టాండ్ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని, మేడారం, పర్యాటక ప్రాంతాలకు బస్సు సర్వీసులను పెంచాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్క సాధారణ ప్రయాణికురాలిగా బస్సులో ప్రయాణించగా మహిళల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.