కాళేశ్వరం దేవస్థానం ఈవో పై వేటు
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం దేవస్థానం ఈవో పై వేటు పడింది. దక్షిణ అరణ్య శైవక్షేత్రముగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో జనవరి 20 సోమవారం గర్భగుడి తలుపులు మూసివేసి ప్రైవేట్ షూటింగ్ నిర్వహించడంపై మీడియాలో కథనాలు ప్రచురించడంతో రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం హాట్ టాపిక్ గా మారి దుమారం లేపింది. భక్తులు ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన ఆలయ ఈవో మారుతి పై వేటు వేస్తూ ఆలయ ఇన్చార్జి బాధ్యతల నుండి తొలగిస్తూ దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. రేగొండ కొడవటంచలో ఈవోగా విధులు నిర్వహిస్తున్న మహేష్ కు కాళేశ్వరం దేవస్థానం ఈవోగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. గుడిలో అపచారానికి బాధ్యుడైన ఈవో పై దేవదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంతో భక్తులు ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.