ములుగు జిల్లా సరిహద్దులో అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ ప్రారంభం
అక్రమ ధాన్యం రవాణాపై కట్టడి
రైతులకు మద్దతు ధర రక్షణ
పారదర్శక సేకరణకు చర్యలు
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 08, తెలంగాణ జ్యోతి: యాసంగి (రబీ) 2025–26 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ములుగు జిల్లాకు ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా వరి ధాన్యం రాకను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమ ప్రాంతాల నుండి వచ్చే ధాన్య రవాణాపై నిఘా పెట్టేందుకు వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ చెక్పోస్ట్ను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సిహెచ్ మహేందర్ జి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి సయ్యద్ షా ఫైసల్ హుస్సైని మాట్లాడుతూ యాసంగి సీజన్లో అక్రమ ధాన్యం రవాణాను పూర్తిగా నియంత్రించడం ద్వారా ప్రభుత్వానికి నష్టం జరగకుండా చూడడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే రైతులకు న్యాయమైన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అందేలా ఈ చర్యలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా స్థానిక రైతుల ప్రయోజనాలు కాపాడబడతాయని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ పౌర సరఫరాల కార్పొరేషన్ ఎస్. కృష్ణవేణి, వాజేడు తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ (సివిల్ సప్లైస్) విజయ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాంసింగ్ తదితర రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.








