వెంకటాపురం పాఠశాలల బాలికలకు హెచ్పివి టీకాలు
గర్భాశయ క్యాన్సర్ నివారణకు కీలకం : డాక్టర్ శివాజీ
వెంకటాపురం నుగూరు, ఏప్రిల్ 11 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, సెక్టార్-1 రంగరాజపురం పరిధిలోని బాలికల ఉన్నత పాఠశాల మరియు కేజీబీవీ విద్యార్థినులకు హెచ్పివి (HPV) టీకా కార్యక్రమం నిర్వహించారు. వెంకటాపురం సిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ శివాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హెచ్పివి టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. వైద్య బృందం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బాలికల తల్లిదండ్రులకు టీకా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. హెచ్పివి టీకా తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నివారించవచ్చని, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేజీబీవీకి చెందిన 9 మంది విద్యార్థినులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో హెడ్ నర్స్ కాంత కుమారి, ఫార్మసిస్ట్ మీనా, హెచ్ఈఓ కుప్పిలి కోటి రెడ్డి, ఏఎన్ఎంలు భారతమ్మ, రోజారాణి, సుశీలతో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.









