యువత భవిష్యత్తుకు ఉన్నత విద్య అవసరం
డ్రగ్స్కు దూరంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచన
కాటారం, ఏప్రిల్ 11, తెలంగాణ జ్యోతి : యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ఉన్నత చదువులు అభ్యసిస్తూ, క్రీడలపై దృష్టి సారించాలని, వ్యసనాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోకూడదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ నుంచి డా. బీఆర్ అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ సమస్య సమాజానికి పెద్ద ముప్పుగా మారిందని, ముఖ్యంగా యువత దీనికి బానిసలై తమ భవిష్యత్తును కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ బానిసల కోసం ప్రభుత్వం ప్రత్యేక డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, మన జిల్లాలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు కానుందని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నివారణపై ఈ ర్యాలీ నిర్వహించబడిందని, డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టుందని హెచ్చరించారు. చదువుకున్న యువత చెడు అలవాట్లకు లోనవకుండా జీవితాన్ని సవ్యంగా మలుచుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ నివారణకు పోలీసు శాఖ గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని, గంజాయి రవాణా దారులు, విక్రేతలపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. యువత సరదా కోసం డ్రగ్స్కు అలవాటు పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని హెచ్చరిం చారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా “ఈగల్ టీం” ఏర్పాటు చేసి పటిష్ట నిగా ఉంచామని, ప్రజలు కూడా బాధ్యతగా సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం 2కే రన్ విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మధుసూదన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని, కౌన్సిలర్లు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









