టేకులగూడెంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
వెంకటాపురం నూగూరు, మార్చి 26, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని టేకులగూడెం గ్రామంలో సర్పంచ్ సిహెచ్ బాలకృష్ణ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తరుణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 35 మంది రోగులను పరీక్షించగా, అందులో ఏడుగురు గర్భిణులకు ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారి రిపోర్టులను పరిశీలించి తగిన మార్గదర్శకాలు ఇచ్చారు. షుగర్, బీపీ రోగులను పరీక్షించి, ముఖ్యంగా బీపీ అధికంగా ఉన్నవారికి అవసరమైన వైద్య సేవలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తీసుకోవలసిన ఆహారం గురించి వివరించారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండాలని సూచించారు. పలుచటి వస్త్రాలు ధరించడం, ద్రవరూప ఆహారం ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టేకులగూడెం సర్పంచ్ సిడం బాలకృష్ణ, డాక్టర్ తరుణ్, హెచ్ఈఓ వేణుగోపాలకృష్ణ, ఫార్మసీ ఆఫీసర్ యాలం సతీష్, హెచ్ఏ తిరుపతి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









