వాడ బలిజలకు మత్స్య సొసైటీ సభ్యత్వాలు ఇవ్వాలి
– తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
వెంకటాపురం,జూన్28, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ అధ్వర్యంలో హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించి వాడ బలిజలకు మత్స్య సొసైటీ సభ్యత్వాలు కల్పించాలని, చెరువులు, కుంటలపై సంపూర్ణ హక్కులు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు గగ్గూరి రమణయ్య మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతంలో లక్షలాది వాడ బలిజులు నివసిస్తున్నా, వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరడంలేదన్నారు. చెరువుల్లో చేప పిల్లల పెంపకంపై, మత్స్య వేటపై సంపూర్ణ హక్కులు కల్పించాలని కోరారు. భద్రాచలం, ఎటూరునాగారం ఐటీడీఏల పరిధిలో 1/70 చట్టం అమలుతో వాడ బలిజులకు అన్యాయం జరుగుతోందన్నారు. వందలాది సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న వాడ బలిజుల వంటి బీసీలకు కనీసం 42% మత్స్య హక్కులు కల్పించాలని, లేకపోతే జనాభా ఆధారంగా ఎస్టీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మత్స్య లైసెన్సుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన చైర్మన్ మెట్టు సాయికుమార్ తక్షణమే ములుగు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి, చట్టపరమైన అడ్డంకులు ఉంటే మార్కెటింగ్ సొసైటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో మార్కెటింగ్ సొసైటీలు ఉన్నా, కొత్త సభ్యత్వాలు ఎందుకు ఇవ్వడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాజేడు మండలంలోని పెద్ద గొల్లగూడెం గ్రామానికి చెందిన 191 పైళ్ల కుటుంబాల ఫైలులు ఆరు నెలలుగా లంబించడాన్ని గుర్తించి, తక్షణమే చేర్చాలని సూచించారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి సభ్యత్వ దరఖాస్తుల కాపీలు ఒక సెట్ జిల్లా అధికారికి, మరొక సెట్ తన కార్యాలయానికి పంపించాలని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు మండలాలకు ఒకే సొసైటీ ఉండడాన్ని తప్పుబట్టి, ప్రతి మండలానికి ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మెట్టు ధనరాజ్, అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తోట ప్రశాంత్, వాజేడు మండల యువజన అధ్యక్షుడు బొల్లె విజయబాబు, గ్రామ కమిటీ సభ్యులు కొప్పుల రామకృష్ణ, అల్లి నరేష్, ముత్తబోయిన ప్రసాద్, అల్లి రాంబాబు, గగ్గూరి కృష్ణార్జునరావు, కొప్పుల మల్లికార్జునరావు, మెట్టుబెల్లి సుధాకర్, కొప్పుల నారాయణ, కొప్పుల అబ్బాయి తదితరులు పాల్గొన్నారు.