ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : వింధ్య నాయక్
నారాయణపేట, జూలై 31, తెలంగాణ జ్యోతి : ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వింధ్య నాయక్ తెలిపారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (ఫర్బాయిస్) లో ర్యాగింగ్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ న్యాయ సేవా సంస్థ చైర్మన్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు ఆదేశాల మేరకు నిర్వహించినట్టు ఆమె తెలిపారు. ర్యాగింగ్ ముప్పు నివారణకు సంబంధించిన వివిధ చట్టాలపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించామని చెప్పారు. ర్యాగింగ్ చేసినా, చేయనిచ్చినా, సహకరించినా శిక్ష ఒక్కటే ఉంటుందని స్పష్టం చేశారు. ఇది మానసిక, శారీరక హింస, అవమానపరిచే చర్యలకు సంబంధించి శిక్షార్హ నేరంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఈ నేరాలకు ఆరు నెలల జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా విధించే అవకాశముందని వివరించారు. ర్యాగింగ్ వల్ల ఇబ్బంది పడుతున్న విద్యార్థులు 2009లో ఏర్పాటు చేసిన నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1800-180-5522 కి సంప్రదించవచ్చని చెప్పారు. చిన్న చిన్న గొడవలకు దూరంగా ఉండాలని, నేరపూరిత శక్తిని ప్రదర్శించి భయపెట్టడాన్ని కూడా చట్టం ప్రకారం ర్యాగింగ్ గానే పరిగణిస్తారని పేర్కొన్నారు.న్యాయ వ్యవస్థలో ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేందుకు లీగల్ డిఫెన్స్ సిస్టమ్ ఉందని, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్న బీసీలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయని తెలిపారు. న్యాయ సలహాల కోసం 15100 నంబర్కు ఫోన్ చేయొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మిపతి గౌడ్, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వరి, సీనియర్ అడ్వొకేట్ నందునా, అడ్వొకేట్ క్రాంతి, కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వర్, ఉపాధ్యాయులు ఆంజనేయులు, పోలీసు అధికా రులు, పారాలీగల్ వాలంటీర్స్ హాజమ్మ, బాలరాజు, నర్సింహులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.