ప్లాస్టిక్ వ్యర్థాల నిషేధంతోనే పర్యావరణ రక్షణ సాధ్యం
– ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహణ
ములుగు ప్రతినిధి, జూన్ 5, తెలంగాణ జ్యోతి : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గోపాలరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని, అందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించా లన్నారు. ఉత్సవాలు, పెండ్లిళ్లలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులను వాడకూడదన్నారు. ప్రతి ఒక్కరు వాహనాల్లో రెండు గుడ్డ సంచులు నిల్వ ఉంచు కోవాలని, కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు ఇంటినుంచే సంచులు తీసుకెళ్లాలని సూచించారు. ఇక ఇంటి చెత్తను ప్లాస్టిక్ కవర్లలో వేసి అలాగే పడేయరాదని, అలా చేస్తే పశువులు తిని ప్రాణాలు కోల్పోవచ్చని హెచ్చరించా రు. “ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించండి” అనే థీమ్ తో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం డిఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణలో మొక్క ను నాటి పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా నడుస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, రాయిని గూడెం పిహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ నాగన్వేష్, డిపిఎచ్ఎన్ శకుంతల, కోఆర్డినేటర్ భూపాల్ రెడ్డి, ప్రోగ్రామ్ మానిటరింగ్ సూపర్వైజర్ సురేష్ బాబు, పిహెచ్ఎన్ శోభ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, డిఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.