పది పరీక్షకేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈవోఏ సిద్ధార్థ రెడ్డి
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 02, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. సిద్ధార్థ రెడ్డి గురువారం వెంకటాపురం మండల కేంద్రంలో పర్యటించి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రంగరాజపురం పాఠశాలలో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. వంటగది మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మన ఊరు–మన బడి పథకం కింద చేపట్టిన పాఠశాల భవనాల నిర్మాణంపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వివరాలు తెలియజేయగా, భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ పర్యటనలో జిల్లా ఉల్లాస్ కోఆర్డినేటర్ డాక్టర్ పీర్ల కృష్ణబాబు, డీపీసీ ఏ. రాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.









