గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
వెంకటాపురం, మార్చి18, తెలంగాణ జ్యోతి: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ పేర్కొన్నారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం శివారు బి.సి. మర్రిగూడెం పంచాయతీ పరిధిలోని నేలరుపేట వీధిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ.15 లక్షల వ్యయంతో మంజూరైన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ సురిటి రాజేశ్వరి, ఉపసర్పంచ్ బొల్లి వెంకన్నతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడం సాంబశివరావు, సీనియర్ నాయకులు బాలసాని వేణు, గుండమల్ల కిరణ్, వార్డు సభ్యులు తాడేపల్లి రాఘవ కృష్ణ, మంచాల భూషణం, కాంట్రాక్టర్ బాలసాని మధు, గ్రామస్తులు పాల్గొన్నారు.






