ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించిన సీఐ శ్రీనివాస్
ఏటూరునాగారం, జూన్ 18, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో “అభయ మిత్ర” కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం కింద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ బాలలపై లైంగిక నేరాల నివారణ చట్టం (పోక్సో) గురించి విద్యార్థులకు వివరిస్తూ, చట్టాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డుప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమాలను పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, బోనఫిక్స్ వంటి ఇతర మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు. తల్లి దండ్రుల కష్టాలను గుర్తించి క్రమశిక్షణతో చదివి, ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్ఐ రాజకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.