రిపోర్టర్పై దాడిని ఖండించిన బీఆర్ఎస్ నేతలు
తాడ్వాయి, జూన్ 25, తెలంగాణ జ్యోతి : తాడ్వాయి మండలంలోని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ చల్లగొండ శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో జరిగిన అవకతవకలపై ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైన కథనాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇది జర్నలిజం పై దాడిగా పేర్కొన్నారు. శ్రీకాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నట్లు తెలిపారు. ‘‘ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నాల్లో భాగంగా జర్నలిస్టులపై దాడులు చేయడం హేయకృత్యమని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ’’ అని పేర్కొన్నారు. దాడిలో పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.