కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బిజెపి పని
– గిరిజనులను చెట్లకు కట్టేసి కొట్టిన చరిత్ర బిఆర్ఎస్ ది
– గాంధీల జీవితం త్యాగాలతో నిర్మితమైంది
– రాష్ట్ర మంత్రి సీతక్క
– రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ములుగులో యూత్ కాంగ్రెస్ భారీ ర్యాలీ
ములుగు ప్రతినిధి, జూన్ 19, తెలంగాణ జ్యోతి : దేశంలో పేదలకు భూములు, ఇండ్లు, ఉద్యోగాలు ఇవ్వని బీజేపీ నేతలు, ప్రభుత్వాలు కులమత విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని, తెలంగాణలో గిరిజనులను చెట్టుకు కట్టేసి కొట్టించిన చరిత్ర బీఆర్ఎస్ నేతలది అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) విమర్శించారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడి దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కుటుంబానిదని స్పష్టం చేశారు. గురువారం రాహుల్ గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకొని ములుగు లోని గట్టమ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి అనంతరం మండలంలోని ఇంచర్ల వరకు 2వేలమంది యూత్ కాంగ్రెస్ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మూడుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా తృణప్రాయంగా వదిలేసి పేద ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. త్యాగాలు చేసిన నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై బీజెపి నాయకులు ఇప్పటికి విషప్రచారం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలోనే పేదలకు భూములు పంచారని, ఆ తరువాత రాష్ట్ర ముఖ్య మంత్రి హోదాలో వైయస్సార్ భూ పంపిణీ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్ప భూములు పంచిన చరిత్ర ఎవరికీ లేదన్నారు. నిరుపేదలకు ఏకకాలంలో రాష్ట్రంలో 5లక్షల ఇండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పేదలకు చేసింది ఏమీ లేదని, కాలేశ్వరం పేరిట చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామని అన్నారు. గిరిజనులను చెట్టుకు కట్టేసి కొట్టించిన చరిత్ర బీఆర్ఎస్ కు ఉందని, పదేళ్లలో పేదలకు ఇండ్లు ఇవ్వని నాయకులు ఏం ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వచ్చి డ్రామాలు చేస్తున్నారని ప్రశ్నించారు. నాయకుల ఫోన్లను టాపింగ్ చేయించిన నీచ సంస్కృతి కూడా బీఆర్ఎస్ కు ఉందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా కులగణనపై పట్టుబట్టారని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, బీసీలకు 42శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ చేపట్టారన్నారు.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతోనే కేంద్రం కూడా కుల గణన చేపడుతోందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా యువకులు రాబోయే ఎన్నికల పై దృష్టి సారించి సన్నద్ధంగా ఉండాలని, ప్రజల్లో, ప్రజలతో ఉన్నవారికి మాత్రమే పార్టీ పట్టం కడుతుందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క పిలుపు నిచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుమేరకు గాంధీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఇన్చార్జి సామా రాంమోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సూర్య, రాష్ట్ర ఇన్చార్జి ఖలీద్, జిల్లా అధ్యక్షుడు ఇస్సార్ ఖాన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.