గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త హామీల ప్రచారం
ఏటూరునాగారం, డిసెంబర్ 4, తెలంగాణ జ్యోతి : మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వాగ్దానాలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సాధారణ అభివృద్ధి హామీలను ఇస్తుంటే, బీజేపీ సర్పంచ్ అభ్యర్థి వినుకొల్లు ధనలక్ష్మి చక్రవర్తి మాత్రం సరికొత్త ఆలోచనతో ప్రచారాన్ని మలుపు తిప్పారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రతి ఇంటికి ఐదేళ్లపాటు ఉచిత వైఫై, టీవీ ఛానెల్స్ ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. అంతేకాదు.. ఈ హామీలను మాటల్లోనే కాకుండా వాగ్దాన పత్రం (స్టాంప్ పేపర్) రూపంలో రాత పూర్వకంగా గ్రామస్తులకు అంద జేయడం ప్రత్యేకంగా నిలిచింది. తన హామీల్లో భాగంగా ఆమెగోదావరి కరకట్ట లీకేజీ సమస్య పరిష్కారం, గ్రామంలోని సైడ్ కాలువలు, డ్రైనేజీ పూర్తి చేయడం, కోతుల బెడద నిర్మూలన, అలాగే గ్రామపంచాయతీ నిధుల ప్రతి రూపాయి ఖర్చును గ్రామస్థులకు పారదర్శకంగా తెలియ జేస్తామని స్పష్టం చేశారు. ఈ పనులన్నీ కేంద్రం నుండి ప్రత్యేక నిధులు మోహరింప జేసి అమలు చేస్తామని ధనలక్ష్మి చక్రవర్తి తెలిపారు. ఈ వినూత్న ప్రచారం ప్రస్తుతం ఏటూరు నగారం గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.







