వెంకటాపురంలో ఘనంగా బీర్షా ముండా వర్ధంతి వేడుకలు
వెంకటాపురం నూగూరు, జూన్9, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకుడు భగవాన్ బీర్షా ముండా 125వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్షా ముండా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ “బీర్షా ముండా 19వ శతాబ్దానికి చెందిన గొప్ప ఆదివాసీ వీరుడని , ఆయన నేతృత్వంలో ‘ఉల్గులాన్’ అనే విప్లవాత్మక ఉద్యమం జరిగిందని, ముండా తెగకు చెందిన ప్రజలు ఆయన్ను భగవత్స్వరూపంగా పూజిస్తారని తెలిపారు. “బీర్షా 1875 నవంబర్ 18న ఝార్ఖండ్ రాష్ట్రంలోని ఉలీహతు గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే సామాజిక అన్యాయాలపై అవగాహన కలిగి, బ్రిటిష్ పాలనను ఎదుర్కొంటూ ఆదివాసీల హక్కుల కోసం పోరాడి చివరకు 1900 జూన్ 9న ఆయన మరణించారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ మాట్లాడుతూ “బీర్షా ముండా చేసిన పోరాట ఫలితంగా 1908లో చోటా నాగపూర్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. వనవాసుల నీరు, అడవి, భూమిపై హక్కుల పరిరక్షణ కోసం ఆయన చూపిన మార్గంలో నేటి యువత ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీఎస్పి కార్యకర్తలు పర్శిక బాబూరావు, పూనెం కృష్ణ, కొమరం భీం కాలని తదితర ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.