ముత్యంధార జలపాతం సందర్శన నిషేధం
అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఫారెస్ట్ రేంజి నూగూరు రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలోని ముత్యంధార జలపాతంకు పర్యాటకుల సందర్శనలను అటవీశాఖ నిషేధించింది. ముత్యం ధార జలపాతానికి వెళ్లే దారులను మూసి వేస్తూ హెచ్చరిక బోర్డులను అటవీ శాఖ సోమవారం ఏర్పాటు చేసింది. అడవుల సంరక్షణ, వన్య మృగాల సంరక్షణతో పాటు భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తగా ముత్యం ధార, జలపాతాన్ని మూసివేస్తున్నట్లు వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుద్దపల్లి వంశీకృష్ణ సోమవారం సాయంత్రం మీడియా కు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు. కొంతమంది జలపాతంలో ప్రమాదకరమైన జలపాతా ల్లో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని తెలిపారు. కొంతమంది గ్రామస్తులు పర్యటకులను రహస్యంగా తీసుకు వెళ్లేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆ పద్ధతిని మార్చుకోవాలని కోరారు. నూగూరు ముత్యం ధార జలపాతం నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై తెలంగాణ అటవీ శాఖ చట్టం (1967) సెక్షన్ 20 ప్రకారం వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఈసందర్భంగా తెలిపారు. అడవులు, వన్య ప్రాణుల సంరక్షణ ప్రజలందరి బాధ్యతని, అడవులను, పర్యావ రణాన్ని కాపాడడంలో ప్రతి పౌరుడు, గ్రామస్తులు అటవీ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ వో వంశీకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.