పొగాకు వాడకంపై వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
ములుగు ప్రతినిధి, మే 31, తెలంగాణ జ్యోతి : ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి నుండి బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీకి కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కమిషనర్ ఆదేశానుసారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ పొగాకు నియంత్ర ణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. గుట్కా, తంబాకు, సిగరెట్, బీడీల వాడకం వల్ల దేశంలో ప్రతి ఏడాది మూడు లక్షల మందికి పైగా మృతి చెందుతున్నారని, వీటిలో ఉండే నికోటిన్ అనే పదార్థం మెదడుపై ప్రభావం చూపించి వ్యక్తిని మత్తు బానిసగా మార్చుతుందని తెలిపారు. అలాగే, గుట్కా, తంబాకు మరియు ఇతర పొగాకుతో తయారు చేసే ఉత్పత్తుల్లో 69 రకాల క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని, వీటి వాడకం లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంద న్నారు. బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం వలన ఇతరుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, మార్కెట్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల వంటి ప్రదేశాల్లో పొగాకు వాడకం చట్టరీత్యా నేరమని, దీనిని ఉల్లంఘిస్తే రూ.2 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చని స్పష్టం చేశారు. ర్యాలీలో పొగాకు దూరంగా ఉందాం – ఆరోగ్యంగా జీవిద్దాం, గుట్కాలు తినొద్దు – ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, పొగాకు వాడొద్దు – క్యాన్సర్కు గురికావొద్దు అంటూ నినదిస్తూ ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం ప్రజలను పొగాకు దూరంగా ఉంచేందుకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నాగ్ అన్వేష్, డెమో సంపత్, డిపి ఎమ్మో సాంబయ్య, ఎన్సిడి కోఆర్డినేటర్లు వెంకట్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మానిటరింగ్ సూపర్వైజర్ సురేష్ బాబు, రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు దేవేందర్, వెంకటాపురం ఆరోగ్య కేంద్రాల ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.