అధికారులు సమన్వయంతో పనిచేసి వరదల వల్ల నష్టం కలగకుండా చూడాలి
– పునరావాస కేంద్రాలు సిద్ధం చేసుకోవాలి.
– అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి.
– శిధిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి వారిని పునరావస కేంద్రాల తరలించాలి.
– గ్రామపంచాయతీ వాహనాలు సిద్ధం చేసుకోవాలి.
– వర్షాకాలంలో అటవీ ప్రాంతాలలోని అనుమతి లేని జలపాతాలకు పర్యాటకు వెళ్తే కేసులు నమోదు.
– వరదల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తు సమీక్ష
– జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి వరదల వల్ల నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో వర్షాలు, వరదల పై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల సంపత్ రావు, డీఎస్పీ రవీందర్ లతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి వరదల వల్ల నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. గత సంవత్సరం సాధారణ కంటే ఎక్కువ వర్షాలు కురవడం వల్ల వరదలు వల్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. జిల్లాలో ఎక్కువ వాగులు, గోదావరినది ఉందని ఎగువ కురిసిన వర్షాలకు ఉధృతంగా వరదలు సంభవిస్తాయని,జిల్లా యంత్రాం గం అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండలాలలో గత మూడు సంవత్సరాలుగా వర్ష పాతం నమోదైన ప్రాంతాలను గుర్తించి నివేదికలు తప్పులు లేకుండా తయారు చేయాలని అన్నారు. వరదలు సంభవించినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయితీ సెక్రటరీ లు అందుబాటులో ఉండాలని గ్రామ స్థాయిలో మొబైల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని, గ్రామ స్థాయిలో పంచాయితీ సెక్రటరీలు, ప్రజా ప్రతినిధులు, మహిళా సమాక్య సభ్యులు, రేషన్ డీలర్లను, యువతను సమన్వయ పరుస్తూ ప్రణాళిక బద్దంగా గ్రామాలలో వరద ఉధృతి కి కారణమయ్యే ప్రాంతాలు, గుర్తించాలని సూచించారు. గ్రామాలలో ఉన్న చెరువులు, కుంటల మత్తడీల వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని వరదలు వస్తే నీరు వెళ్ళడానికి అడ్డుపడి చెరువులు తెగిపోయే అవకాశం ఉంటుందని అన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారులపైకి నీరు చేరిన మార్గాలలోను, పొంగుతున్న వాగులు దాటకుండా పటిష్ఠ నియంత్రణకు పోలీస్ సహాయంతో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారిపై రవాణా నియంత్రణకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో పునరావాస కేంద్రాలకు ఏర్పాట్లు చేయాలని, పునరావాస కేంద్రాలలో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని వరదలు సంభవించినప్పుడు ట్రాక్టర్లు, జేసిబిల సేవలను వినియోగిం చాలని ఆన్నారు. వరదల సమయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని గర్భిణీ స్త్రీలు, ఆత్యవసవర చికిత్స పొందుతున్న రోగులను గుర్తించి ముందస్తుగా ఆసుప త్రులకు తరలించాలన్నారు. గోదావరి పరివాహక గ్రామాలలో గోదావరి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలని ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు వర్షాకాలంలో మందులు, ఆహారం, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల చికిత్స కు అవసరమయ్యే మందులను అందుబాటులో ఉంచుకోవాల న్నారు. పంచాయితీ సెక్రటరీ లు గ్రామాలలో శిధిలావస్థలో ఉన్న ఇళ్లను, వంగిన విద్యుత్ పోల్స్, అలాగే పడిపోయే దశలో ఉన్న చెట్లు గుర్తించి తొలగించాలని అన్నారు. వరదల ముంపుకు గురైన ప్రాంతాలలో అత్యవసర వైద్య సేవలు అందించాలని, నిరంతరాయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి బ్లీచింగ్ చేయాలని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు చెరువు కట్టలను పరిశీలించి వరదల సమయంలో తెగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. వరదలు సమయంలో పశువుల కాపరులు, రైతులు చెరువులు కాలువలు దాటి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలని అన్నారు. గ్రామ, మండల, జిల్లా అధికారులు అత్యవసర సేవలకు గాను కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రతి గ్రామ పంచాయతీలో ఫాగింగ్ మిషన్లు ఉండాలని ప్రతి రోజు గ్రామ పంచాయితీల్లో ఫాగింగ్ చేయించాలని అన్నారు. నీరు కలుషితం కాకుండా చూడాలని, మంచి నీటి పైపులను పరిశీలించి మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రతి చెరువు దగ్గర సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని, చెరువుల స్టోరేజ్ వివరాలను ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియపరచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. త్రాగునీరు కలుషితం కాకుండా పంచాయితీ రాజ్, ఆర్డబ్లూఎస్ శాఖలు సమన్వయంతో పని చేసి నీరు కలుషితం కాకుండా ఫ్లోరో స్కోప్ ద్వారా మంచి నీటి పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ప్రమాద కర రోడ్ల వివరాల నివేదిక అందించాలని అక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పశు సంవర్థక శాక ద్వారా వానాకాలంలో పశువులకు వచ్చే సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని వర్షాలు కురిసినప్పుడు పశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాలు కురిసే సమయానికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలని, మత్స్య శాఖ ద్వారా జాలరులను, మత్య కారులను ప్రతి గ్రామాలలో అందుబాటులో ఉంచాలని అన్నారు. వరదలు సంభవించినప్పుడు వారితో సహాయ చర్యలు చేపట్టాలని, వారికి లైఫ్ జాకెట్లు, తెప్పలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్డు పక్కన ఉన్న వంగి ఉన్న చెట్లు కొమ్మలను తొలగించాలని, ప్రతి రోజు ఫాగింగ్ చేయించాలని దోమలు లేకుండా, నీరు నిలవ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. విద్యుత్తు శాఖ అధికారులు వర్షాలకు, గాలులు సంభవించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని శిధిలావస్థలో ఉన్న కరెంట్ పోల్సు , ట్రాన్స్ఫార్మలను గుర్తించాలని, చెట్ల కింద ఉన్న కరెంట్ వైర్లను గుర్తించాలని పంట పొలాల లో , రోడ్లపై కిందకి వేలాడే కరెంట్ వైర్లను గుర్తించి మరమ్మత్తులు చేయాలని, అతి పెద్ద వరదలు సంభవించి కరెంట్ పోతే తిరిగి తక్కువ సమయంలో విద్యుత్ సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారులు అన్నీ శాఖల అధికారులను సమన్వయ పరుస్తూ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లో వరదల వల్ల నష్టం కలగకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, ఇరిగేషన్, నేషనల్ హై వే, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్, విద్యుత్ అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంపిఓల తోపాటు తదితరులు పాల్గొన్నారు.