సీఎం కాలేశ్వరం పర్యటనకు అన్ని ఏర్పాట్లు
కాటారం, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గురువారం కాళేశ్వరం పర్యటనకు రానున్న సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ముఖ్యమంత్రి భద్రతా అధికారి వాసుదేవరెడ్డి తెలిపారు. బుధవారం కాళేశ్వరంలో ఈఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలెవ్వరూ అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ ద్వారా గురువారం సాయంత్రం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారని ముఖ్యమంత్రి రవాణా చేయు మార్గంలో పోలీస్ బందోబస్తు, బాంబ్ స్క్వాడ్, ట్రాఫిక్ కంట్రోల్, ఆయా విభాగాల సమన్వయంతో భద్రతా చర్యలు, పర్యవేక్షణ చేయాలని తెలిపారు. మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాల సేవలు వినియోగించనున్నట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ప్రత్యాన్మయంగా జనరేటర్ సిద్ధంగా ఉంచాలని విద్యుత్ అధికారులకు సూచించారు. బందోబస్తు ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డిఓ రవి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.