ప్రజల భద్రత కోసం అభయ మిత్ర
– ములుగు పోలీసుల వినూత్న కార్యక్రమం
– ప్రారంభించిన ఎస్పీ డాక్టర్ పి.శబరీష్
ములుగు ప్రతినిధి, జూన్ 17, తెలంగాణ జ్యోతి : ప్రజల భద్రతే తమకు ముఖ్యమని, వారిలో భద్రతపై భరోసా కల్పించేందుకు గాను అభయ మిత్ర అనే నూతన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ వెల్లడించారు. మంగళవారం ములుగు మండలం జాకారం గ్రామంలో అభయ మిత్ర కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నివారణ, నకిలీ విత్తనాల నియంత్రణ, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పోలీసులు -ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేయడమే అభయ మిత్ర కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. మండలంలోని 32 గ్రామాల్లో ఇప్పటికే యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. నిషేధిత మాదక ద్రవ్యాలపై సమాచారాన్ని పోలీసులకు అందిస్తే దారి తప్పిన యువతను రీహాబిలిటేషన్ కేంద్రాలకు తరలించి మార్పు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోనున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రామాల్లో గంజాయి సరఫరా, వినియోగం, విక్రయంపై సమాచారమివ్వడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని పేర్కొన్నా రు. అదే విధంగా నకిలీ విత్తనాల విక్రయాలపై ముందస్తు సమాచారం ఇచ్చిన వారికి ఎస్పీ రూ.10వేలు నగదు బహుమతి ప్రకటించారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన ఎస్పీ మైనర్లతో సంబంధాలు చట్టవిరుద్ధమని యువతకు సూచించా రు. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు, లోన్ యాప్స్ ద్వారా మోసపోవద్దని, బాధితులు వెంటనే 1930టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. యువత బెట్టింగ్, జూదా నికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. పంట పొలాల చుట్టూ కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ప్రాణాంతకమన్నారు. రోడ్డు భద్రతలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్, సీఐ సురేష్, ఎస్ఐ వెంకటేశ్వర్ రావు, రామకృష్ణ, యాంటీ డ్రగ్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.