పోలీసులు ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేయడమే అభయ మిత్ర లక్ష్యం
– వెంకటాపురం సి.ఐ.బి. కుమార్.
వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : పోలీసులు ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేయటమే అభయ మిత్ర కార్యక్రమమని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ అన్నారు. వెంకటాపురం మండల కేంద్రంలోని అతిథి గ్రుహం ఆవరణలో బుధవారం అభయ మిత్ర కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని సీ.ఐ. బి. కుమార్ మాట్లాడారు. నూతన కమ్యూనిటీ కనెక్ట్ విటిలో భాగంగా అభయ మిత్ర ద్వారా పోలీసుల సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తిన పోలీస్ శాఖ ద్వారా, ప్రజా సహకారంతో పరిష్కరించేందుకు తమ శాఖ సిద్ధంగా ఉంటుంద న్నారు. ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యాలు, గంజాయి, సైబర్ నేరాలు, ఫోక్సో నేరాలు, వృద్ధ తల్లిదండ్రులపై నిర్లక్ష్యం వహించడం, ఇంకా అనేక చట్ట విరుద్ధ కార్యక్రమాలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతం చేయటమే పోలీస్ శాఖ అభయ మిత్ర అని తెలిపారు. రైతులను పీడిస్తున్న నకిలీ విత్తనాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, విత్తనాలు కొనుగోలు చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రసీదులు పొందాలని ఇంకా అనేక జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే గోదావరి వరదలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాగులు పొంగి నప్పుడు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బడి వయసు పిల్లలు ను,బడికి పంపించాలని, గ్రామీణ యువత విద్య, ఉద్యోగ ఉపాధి రంగాలలో ముందుకు సాగాలని సూచించారు. గ్రామాల్లో గంజాయి, గుడుంబా, జూదం, ఆన్లైన్ బెట్టింగ్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రస్తుత సమాజంలో గంజాఇ విస్తరిస్తున్నదని, దానిని అరికట్టవలసిన బాధ్యత ప్రజలపై ఉందని, అన్నారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అపరిచిత నెంబర్ ల నుండి వచ్చే లింకులు, పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఫోక్సో చట్టం పట్ల ప్రజలకు అవగాహనతో ముందుకు సాగాలని, లేనట్లయితే చట్ట పరిధిలో కఠినంగా వ్యవహరించవలసి వస్తుందని, ఫలితంగా జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు.సైబర్ నేరాలు బారిన పడిన బాధితులు వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి, నగదు రక్షణ పొందవచ్చునని తెలిపారు. డయల్ 100 నెంబర్ కు ఏ సమయంలో అయినా ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపారు. వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే.తిరుపతిరావు అభయ మిత్ర సమావేశంలో అనేక అంశాలపై సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి, గిరిజనులు,ప్రజలు తరలి వచ్చి, అభయ మిత్ర అవగాహన సమావేశంలో పాల్గొన్నారు. పోలీసులు ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు, అభయమిత్ర లక్ష్యాలను, కమ్యూనిటీ కనెక్ట్ విటి ప్రోగ్రాం, ఫ్రెండ్లీ పోలీసింగ్, రోడ్డు భద్రత నియమాలు, ఇంకా అనేక అభయ మిత్ర కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్, వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు,శిక్షణ ఎస్.ఐ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.