వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం
తిరుగువారంతో జాతర ప్రాంతం కోలాహలం
తాడ్వాయి, ఫిబ్రవరి 4 (తెలంగాణ జ్యోతి): ప్రపంచ ప్రసిద్ధ శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా బుధవారం తిరుగువారాన్ని పురస్కరించు కుని తాడ్వాయి మండలంలోని వన దేవతల సన్నిధి భక్త జనసందోహంతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం వన దేవతలకు బంగారం, ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించు కున్నారు. భక్తుల రద్దీ కొనసాగుతున్న తరుణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. జాతర పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికుల ద్వారా వ్యర్థాలను తొలగిస్తూ, వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుగువారం సందర్భం గా వన దేవతల పూజారులు కన్నేపల్లి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, దీప–ధూప–నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవార్ల పూజ సామాగ్రి, పట్టు వస్త్రాలను భద్రపరిచారు.






