ఘనంగా గట్టమ్మకు ఎదురుపిల్ల పండుగ..
– 14 లక్ష్మీదేవరలతో తరలివెళ్లిన పూజారులు
ములుగు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మేడారం మహాజాతరకు ముందు జరిగే మండమెలిగే పండుగ రోజున ములుగు గట్టమ్మకు ఆదివాసీ నాయకపోడ్ లు నిర్వహించే ఎదురు పిల్ల పండుగ బుధవారం ఘనంగా జరిగింది. ఆదివాసీ సాంప్రదాయాల నడుమ డోలు వాయిద్యాలతో కుల దైవాలైన లక్ష్మీదేవరలను ప్రత్యేక నృత్యాలు చేస్తూ డోలు వాయిద్యాల తో వేడుకలు నిర్వహిస్తూ ములుగు నుంచి గట్టమ్మ తల్లి ఆలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. మొదటి మొక్కుల తల్లి గట్టమ్మకు నాయక పోడ్ పూజారులు బోనాలతో నైవేద్యం సమర్పించారు. ఈ తతంగం ఆసాంతం అబ్బురపరిచింది. ములుగు జిల్లాల్లోని రొయ్యూరు, సింగారం, బూర్గుపేట, చల్వాయి, పత్తిపల్లి, వెంకటాపూర్, సీతారాంపురం, ఏటూరు నాగారం, కమలాపూర్, వీరాపూర్, ముప్పనపల్లి, కడేకల్ తదితర గ్రామాల నుంచి నాయకపోడ్లు లక్ష్మీదేవరలతో తరలివచ్చారు. ములుగు లోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి అంతా కలిసి భారీ ర్యాలీగా గట్టమ్మతల్లి చెంతకు బయలుదేరారు. 14 లక్ష్మీదేవరలను ప్రత్యేకంగా అలంకరించి నృత్యాలు చేస్తూ వెళ్లిన నాయకపోడ్లు సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవారిని కొలిచారు.
– గట్టమ్మకు యాట మొక్కులు..
నాయకపోడ్ మహిళలు ములుగు నుంచి గట్ట మ్మ వరకు 3 కిలోమీటర్ల మేర కాలినడకన 70 బోనాలతో తరలి వెళ్లి తల్లికి నైవేద్యాన్ని సమర్పించారు. ప్రధాన పూజారి కొత్త సదయ్య ఆధ్వర్యంలో పూజా సామగ్రిని వెదురు బుట్టలో తీసుకువెళ్లి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరె, సారె, గాజులు పెట్టి, ఒడిబియ్యం పోశారు. ఎదురుపిల్ల పండుగ సందర్భంగా యాటపోతుల మొక్కులు చెల్లించారు. అంతకు ముందే గట్టమ్మ పక్కనే ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దెలవద్ద సమీప అడవుల నుంచి తీసుకువచ్చిన కంకవనాన్ని ప్రతిష్ఠించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీ సేవాసంఘం నాయకపోడ్ సంఘం నాయకులు, వారి కుటుంబ సభ్యులు సుమారు 1500లమంది తరలివచ్చారు. అనంతరం ఆదివాసీల సమ్మేళనం కార్యక్రమాన్ని గట్టమ్మ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారులు కొత్త సదయ్య, కొత్త లక్ష్మయ్య, ఆకుల మొగిలి, అరిగెల సమ్మయ్య, ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ కూన దయానంద స్వామి, రాష్ర్ట ఉపాధ్యక్షుడు, జైలర్ కూన ఆనంద్, రాష్ర్ట నాయకుడు పసుల బుచ్చయ్య, నాయకపోడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, గంటమూరి భాగ్యలక్ష్మీ, గొట్టెం భూమయ్య, మందపల్లి భాస్కర్, దబ్బ శీను, మాజీ సర్పంచ్ లు బత్తుల లక్ష్మీ, చేర సారంగం, పాలెం యాదగిరి, కోట నర్సింహం, చిర్ర రాజేందర్, కూన శివరాం తదితరులు పాల్గొన్నారు.